ప్రముఖ పద్యకవి చదలవాడ లక్ష్మీనరసింహారావు కన్నుమూత

ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ పద్యకవి, 'పద్యభారతి' బిరుదాంకితులు చదలవాడ లక్ష్మీనరసింహారావు (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఒంగోలులోని తన స్వగృహంలో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సాహితీలోకంలో విషాదం నెలకొంది.

లక్ష్మీనరసింహారావు సాంఘిక శాస్త్ర, ఆంగ్ల ఉపాధ్యాయుడిగా మూడున్నర దశాబ్దాల పాటు పనిచేశారు. సంతనూతలపాడు పరిసర ప్రాంతాల్లో నిబద్ధత కలిగిన ఉపాధ్యాయునిగా పేరు తెచ్చుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా పద్య కవిగా సాహితీ సేవ చేస్తూ వందలాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన స్థాపించిన 'పద్య సారస్వత పరిషత్' ద్వారా ఎంతోమంది యువకులను పద్య కవులుగా తీర్చిదిద్దారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిషత్ శాఖలు విస్తృతంగా పనిచేస్తున్నాయి. పద్య సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 'పద్యభారతి' అనే బిరుదు లభించింది.

ఆధ్యాత్మిక చింతన కలిగిన ఆయన, ఒంగోలులోని శ్రీపశుపతీశ్వర స్వామి దేవస్థాన నిర్మాణానికి లక్షల రూపాయల విరాళం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కొంతకాలం క్రితం ఆయన అర్ధాంగి మరణించారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. లక్ష్మీనరసింహారావు అంత్యక్రియలు నేడు (సోమవారం) నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Chadhalavada Lakshmi Narasimha Rao
Padya Kavitha
Telugu Poet
Prakasham District
Andhra Pradesh
Padya Saraswatha Parishath
Ongole
Telugu Literature
Telugu Poetry

More Telugu News